సింగరేణి భవన్ లో ఆత్మీయ అభినందన సభలో సీఎండీ ఎన్.బలరామ్
సింగరేణి భవన్, డిసెంబరు 10, వై 7 న్యూస్
సింగరేణి ఉద్యోగి, కవి జయ రాజ్ తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్రకు గుర్తింపుగా తామ్ర పత్రం, నగదు పురస్కారంతో సన్మానించబోతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన సింగరేణీయులందరికీ గర్వకారణమని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. కవిగా ప్రజా చైతన్య ఉద్యమాల్లో ఆయన ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు, అక్షరాస్యత పెంపునకు తన రచనల ద్వారా ఎంతో కృషి చేశారన్నారు. మంగళవారం సింగరేణి భవన్ లో ఏర్పాటు చేసిన అభినందన సభలో సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన తొమ్మిది మంది కళాకారుల జాబితాలో జయ రాజ్కు చోటు దక్కడం సింగరేణీయులందరికీ లభించిన గౌరవమన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్ జనక్ ప్రసాద్, డైరెక్టర్(పర్సనల్, పి అండ్ పి) జి.వెంకటేశ్వరరెడ్డి, జీఎం(కో ఆర్డినేషన్) ఎస్డి.ఎం.సుభానీ, జీఎం(మార్కెటింగ్) రవి ప్రసాద్, జీఎం(ఐఆర్, పీఎం) కవితా నాయుడు మాట్లాడుతూ.. ప్రజా కవిగా జయ రాజ్ ఎన్నో స్ఫూర్తి గీతాలు రాశారని కొనియాడారు. ఈ సందర్భంగా జయ రాజ్ మాట్లాడుతూ, సింగరేణి అందించిన సహకారం, ప్రోత్సాహం వల్లే తాను కవిగా, ఉద్యమ కారుడిగా ఉన్నత స్థాయికి చేరుకోగలిగానని భావోద్వేగానికి గురయ్యారు. సింగరేణి భవన్ ఉద్యోగులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.