పలాస వజ్రపుకొత్తూరు:
వజ్రపుకొత్తూరు మండలంలోని పూండి రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రం నుంచి సికింద్రాబాద్కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద ఉన్న 16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వజ్రపుకొత్తూరు ఎస్సై నీహార్ తెలిపారు.
నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు పూండి రైల్వే స్టేషన్ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న సరోజ్, ప్రమోద్ అనే ఇద్దరిని తనిఖీ చేయగా, వారి వద్ద ఉన్న బ్యాగుల్లో గంజాయి బయటపడింది.
తక్షణమే గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్కు తరలిస్తామని ఎస్సై తెలిపారు.
గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.








