మధిర నియోజకవర్గ పర్యటనలో భాగంగా బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంలో నిర్మాణం అవుతున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న భవన సముదాయాలను స్వయంగా సందర్శించి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులు, గుత్తేదారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జూనియర్ హాస్టల్, జూనియర్-సీనియర్ అకాడమిక్ భవనాలు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్తో పాటు మెకానికల్, సైన్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ ల్యాబ్ భవనాల నిర్మాణాన్ని ఆయన సమగ్రంగా పరిశీలించారు.
విద్యకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. విద్యపై చేసే ఖర్చు భవిష్యత్ తరాల నిర్మాణానికి పెట్టుబడిగా అభివర్ణించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని అధికారులను హెచ్చరించిన ఆయన, ఈ పాఠశాలలు రేపటి తరాలను తీర్చిదిద్దే దార్శనిక కేంద్రాలుగా నిలవాలని ఆకాంక్షించారు.








