E-PAPER

గోదావరిలో విషాదం.. 5 మంది బీటెక్ విద్యార్థులు గల్లంతు, ముగ్గురి మృతదేహాలు లభ్యం

వై 7 న్యూస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పరిధిలో గోదావరి నదిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉగాది సెలవుల సందర్భంగా స్నేహితులతో కలిసి వచ్చిన బీటెక్ విద్యార్థులు నదిలో స్నానానికి దిగగా ప్రమాదం సంభవించింది.
అమరావతి ప్రాంతంలోని ఎస్ఆర్‌ఎంటీ (SRMT) కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, భద్రాచలం ప్రాంతానికి చెందిన తమ మిత్రులు అభిరామ్, శ్రీకర్‌లతో కలిసి ఎటపాక మండలం పురుషోత్తమపట్నం గ్రామ శివారులోని కొల్లిగూడెం ఇసుక ర్యాంప్ సమీప గోదావరిలోకి దిగారు. ఫోటోలు తీసుకుంటూ ఉండగా మొత్తం ఏడుగురు యువకులు అకస్మాత్తుగా ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరు ఈత తెలిసి సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, ఐదుగురు గల్లంతయ్యారు.
గల్లంతైన వారిని అభిరామ్, శ్రీకర్, తేజ, సతీష్, నవదీప్‌లుగా గుర్తించారు. ఇందులో అభిరామ్, శ్రీకర్ భద్రాచలం ప్రాంతానికి చెందినవారు కాగా, నవదీప్ ఉయ్యూరు వాసి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. ప్రత్యేక రిస్క్యూ బృందాలు కూడా మృతదేహాల కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి.
ఈ క్రమంలో గల్లంతైన ఐదుగురిలో ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి. భద్రాచలానికి చెందిన శ్రీకర్, అభిరామ్, అలాగే ఉయ్యూరుకు చెందిన నవదీప్ మృతదేహాలను అధికారులు వెలికితీశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది.
మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి. ఈ ఘటన ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News