ది ప్రెస్ క్లబ్ సూర్యాపేట” నూతన కమిటీకి అభినందనలు తెలిపిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి
సూర్యాపేట:
మీడియా రంగంలో నిత్యం మారుతున్న ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని పత్రికలు, చానళ్లు జర్నలిజం విలువలను మరింతగా కాపాడి, ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందించే విధంగా పనిచేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి సూచించారు. ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన ది ప్రెస్ క్లబ్ సూర్యాపేట నూతన కమిటీ సభ్యులు మంగళవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నూతన కమిటీకి అభినందనలు తెలిపిన వేణారెడ్డి మాట్లాడుతూ, రేటింగ్ల కోసం వాస్తవాలను వక్రీకరించే అనవసర ప్రయత్నాలకు దూరంగా ఉండాలని, నిజాయితీని ప్రతిబింబించే నిష్పక్షపాత వార్తలతో ప్రజలకు సేవ చేయాలని జర్నలిస్టులకు సూచించారు. ప్రభుత్వానికి ప్రజల సమస్యలను చేరవేసే వేదికగా మీడియా ఎప్పుడూ చురుకుగా ఉండాలని, సమాజ మార్పులో జర్నలిస్టుల పాత్ర అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
మీడియా రంగంలో ప్రతి రోజూ వెలువడుతున్న నూతన మార్పులతో పాటు జర్నలిస్టులు కూడా తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ది ప్రెస్ క్లబ్ సూర్యాపేట అధ్యక్షుడు నాయిని శ్రీనివాసరావును వేణారెడ్డి సన్మానించారు. నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించిన సభ్యులు తమకు అప్పగించిన ప్రతి బాధ్యతను నిజాయితీతో నిర్వర్తించి, జర్నలిస్టుల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేయాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.









