బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన రక్షా బంధన్ పండుగ ప్రకటన చుట్టూ మొదలైన వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఈ యాడ్పై వచ్చిన విమర్శల నేపథ్యంలో పితృస్వామ్య వ్యవస్థపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా “పితృస్వామ్యాన్ని కూల్చివేయండి” అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా బీజేపీ అధికారికంగా చేసిన పోస్ట్ను రీషేర్ చేశారు. రక్షా బంధన్ వంటి సంప్రదాయ పండుగను చుట్టుముట్టిన వివాదం ఇప్పుడు సినీ రంగాన్ని దాటి రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది.
మరోవైపు కృతి సనన్ నటించిన రాఖీ యాడ్పై సోషల్ మీడియాలో ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యాడ్లో కృతి ధరించిన దుస్తులు, పెంపుడు కుక్కకు రాఖీ కట్టే సన్నివేశంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేయగా.. మరికొందరు దానికి మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, కంగనా రనౌత్ వ్యాఖ్యలతో రాఖీ యాడ్ వివాదం మరింత హాట్ టాపిక్గా మారింది.









