చింతూరు, ఆగస్టు 21 (వై7 న్యూస్): పోలవరం ప్రాజెక్టు ఫేజ్–1బి పరిధిలోని చింతూరు డివిజన్లో గిరిజనేతర ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాల (PDFs) కోసం వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) దరఖాస్తుల సమర్పణ గడువును ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించినట్లు ఐటీడీఏ చింతూరు ప్రాజెక్టు అధికారి శుభం నొక్వల్ తెలిపారు.
కూనవరం, చింతూరు, వీఆర్పురం మండలాలకు చెందిన మొత్తం 30 ముంపు గ్రామాల్లో 1వ, 2వ డ్రాఫ్ట్ స్కీమ్లలో పేర్లు ఉన్న గిరిజనేతర నిర్వాసిత కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఇప్పటివరకు ఓటీఎస్ దరఖాస్తులు సమర్పించని అర్హులైన నాన్-ట్రైబల్ పీడీఎఫ్లు తమ దరఖాస్తులను ఆగస్టు 22లోపు ఐటీడీఏ చింతూరు ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. 1వ, 2వ డ్రాఫ్ట్ స్కీమ్లలో పేర్లు ఉన్న సంబంధిత కుటుంబాలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, ఇప్పటికే దరఖాస్తు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
అర్హులైన గిరిజనేతర నిర్వాసిత కుటుంబాలు గడువు పొడిగింపును వినియోగించుకుని నిర్ణీత తేదీలోపు తమ ఓటీఎస్ దరఖాస్తులను సమర్పించాలని ప్రాజెక్టు అధికారి శుభం నొక్వల్ విజ్ఞప్తి చేశారు.








