భారత సైన్యంలో చేరే అవకాశం కోసం నేపాల్ యువత, మాజీ గోర్ఖా సైనికులు రోడ్డెక్కారు. తమ దేశ యువతను భారత సైన్యంలో ‘అగ్నిపథ్’ పథకం కింద నియమించే ప్రక్రియను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పోఖరా నగరంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ ఆందోళనల వెనుక గోర్ఖా సైనికుల తరతరాల సంప్రదాయంతో పాటు వేలాది కుటుంబాల ఉపాధి ఆశలు కూడా ఉన్నాయి.
1815లో సుగౌలీ ఒప్పందం కాలం నుంచి నేపాల్ గోర్ఖాలు భారత సైన్యంలో సేవలందిస్తున్నారు. 1947లో భారత్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత కూడా ఈ సంప్రదాయం కొనసాగింది. రెండు శతాబ్దాలకు పైగా కొనసాగుతున్న ఈ సుదీర్ఘ సైనిక సేవకు 2020లో కరోనా మహమ్మారి కారణంగా తాత్కాలికంగా విరామం ఏర్పడింది. అయితే 2022లో భారత్ ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ నియామక విధానం ఈ అంశాన్ని మరింత వివాదాస్పదంగా మార్చింది.
అగ్నిపథ్ పథకం కింద ఎంపికైన అగ్నివీరులు నాలుగేళ్ల పాటు సైన్యంలో సేవలందించాల్సి ఉంటుంది. అనంతరం కేవలం 25 శాతం మందిని మాత్రమే పూర్తిస్థాయి సైనిక సేవలో కొనసాగించే అవకాశం ఉంటుంది. తక్కువ కాలం సర్వీస్, సేవ అనంతరం సైనికుల భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం, గత త్రైపాక్షిక ఒప్పందాలకు ఈ విధానం భిన్నంగా ఉందనే కారణాలతో నేపాల్ ప్రభుత్వం గోర్ఖా రిక్రూట్మెంట్ను నిలిపివేసింది. దీంతో నియామకాలను పునరుద్ధరించాలనే డిమాండ్తో నేపాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి.








