ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం AI2379 గాలిలోనే తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఎయిర్బస్ A320 (VT-EXO) విమానం సుమారు 300 అడుగుల మేరకు అకస్మాత్తుగా కిందికి పడిపోయిన ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండైన తర్వాత నిర్వహించిన మెయింటెనెన్స్ రిపోర్టులో కీలక వివరాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
విమానంలో స్వల్ప వ్యవధిలోనే గ్రీన్, ఎల్లో, బ్లూ హైడ్రాలిక్ వ్యవస్థలకు సంబంధించి మూడు లో-ప్రెజర్ అలర్ట్స్ నమోదైనట్లు తెలుస్తోంది. ఈ హెచ్చరికల తర్వాత కొద్దిసేపటికే ఆటోపైలట్ డిస్కనెక్ట్ అయినట్లు రికార్డుల్లో నమోదైంది. అనంతరం విమానంలో మరోసారి ఆటోపైలట్కు సంబంధించిన వార్నింగ్ నమోదైనట్లు సమాచారం.
ఈ పరిణామాల ఆధారంగా మొదట ఆటోపైలట్ డిస్కనెక్ట్ అయిన తర్వాత తిరిగి యాక్టివేట్ అయి, ఆపై మరోసారి డిస్ఎంగేజ్ అయి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విమానం ఎందుకు అకస్మాత్తుగా కిందికి పడిపోయింది, హైడ్రాలిక్ వ్యవస్థల హెచ్చరికలకు దానికి సంబంధం ఉందా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. అధికారిక విచారణ పూర్తయిన తర్వాతే ప్రమాదానికి అసలు కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.








