మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఇరాన్కు మద్దతుగా ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఇప్పుడు ఎర్ర సముద్రంలోని అత్యంత కీలక సముద్ర మార్గమైన బాబ్ అల్-మండేబ్ జలసంధిపై తమ ప్రభావాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలపై నియంత్రణ సాధించేందుకు హౌతీలు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
ఈ పరిణామాల మధ్య అమెరికా, సౌదీ అరేబియాలకు ప్రత్యర్థులుగా ఉన్న హౌతీలతో చైనా చర్చలకు సిద్ధమవడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎర్ర సముద్రంలో ప్రయాణించే తమ చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలకు భద్రత కల్పించేలా హామీలు పొందడమే చైనా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. సముద్ర మార్గాల్లో ఏర్పడుతున్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా బీజింగ్ ఈ చర్యలు చేపడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
జూలై 20న హౌతీలు బాబ్ అల్-మండేబ్ జలసంధిపై దిగ్బంధనాన్ని ప్రకటించిన తర్వాత, ఆ మార్గంలో ప్రయాణించే తమ నౌకలకు ఆటంకాలు కల్పించవద్దని కోరిన తొలి దేశంగా చైనా నిలిచింది. ఈ పరిణామాలు ప్రపంచ వాణిజ్యం, చమురు రవాణాపై మరింత ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.









