అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. యుద్ధ పరిస్థితులు చల్లబడుతున్నాయనుకున్న సమయంలో మళ్లీ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరాన్పై అమెరికా వైఖరి మరింత కఠినంగా మారడంతో అంతర్జాతీయ సమాజంలో ఆందోళన నెలకొంది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, “నేను స్వయంగా ఆపమని చెప్పేంత వరకు ఇరాన్పై అమెరికా సైనిక దాడులు ఆగవు” అని హెచ్చరించారు. అంతేకాకుండా, అమెరికాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
హోర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలు విధించడమే తాజా ఉద్రిక్తతలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన మార్కెట్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.








