1999లో విడుదలైన ‘దేవి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరో షిజు తాజాగా తన సినీ ప్రయాణం, ‘దేవి’ సినిమా షూటింగ్ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. సినిమా విడుదలై 25 ఏళ్లు గడిచినా, ఆ చిత్రంపై తెలుగు ప్రేక్షకులు చూపుతున్న అభిమానాన్ని ఇప్పటికీ మర్చిపోలేనని అన్నారు. షూటింగ్ సమయంలో ఎదురైన ప్రమాదాలు, సవాళ్లతో పాటు తెలుగు చిత్రసీమ తనకు అందించిన అవకాశాల గురించి ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను ఇప్పటికీ ఆరోగ్యంగా, ఉత్సాహంగా కనిపించడానికి కారణం టెన్షన్ లేకుండా జీవించడమేనని షిజు చెప్పారు. మలయాళీ అయినప్పటికీ తెలుగు భాషపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని, ఇప్పటివరకు 90కి పైగా తెలుగు చిత్రాల్లో నటించానని తెలిపారు. తన కెరీర్లో 60 నుంచి 70 శాతం సినిమాలు వంద రోజులు ప్రదర్శించబడటం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
మలయాళంలో కూడా సినిమాలు చేసినప్పటికీ, తన నటనకు పూర్తి స్థాయిలో అవకాశాలు ఇచ్చింది తెలుగు సినీ పరిశ్రమేనని షిజు అన్నారు. ‘వికటకవి’ చిత్రంలో 90 ఏళ్ల వృద్ధుడి పాత్రలాంటి విభిన్న పాత్ర తెలుగులోనే దక్కిందని చెప్పారు. కళాకారులకు సొంత రాష్ట్రాల కంటే ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువ గుర్తింపు లభిస్తుందని అభిప్రాయపడిన ఆయన, తెలుగు ప్రేక్షకులు కళాకారులను ఎంతో గౌరవిస్తారని, వారి ప్రేమాభిమానాలు తనకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.









