శ్రీకాకుళం జిల్లా, పలాస, జూలై 5 (వై7న్యూస్):
పలాస నియోజకవర్గంలో కొనసాగుతున్న టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా పనులను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరితగతిన ఇళ్లను అందజేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా టిడ్కో కాలనీలలో తాగునీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్ష నిర్వహించారు. కాలనీల్లో అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రతి అర్హులైన లబ్ధిదారుడు అన్ని వసతులతో కూడిన సొంత ఇంటిలో నివసించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని ఆమె పేర్కొన్నారు.








