పలాస, జూలై 1 (వై 7 న్యూస్): పలాసలోని 108 అత్యవసర అంబులెన్స్ సేవలను ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ అవని బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్ వాహనాల నిర్వహణ, పరిశుభ్రత, అత్యవసర వైద్య పరికరాలు, మందుల నిల్వలు, రోగులకు అందిస్తున్న సేవల తీరును క్షుణ్ణంగా పరిశీలించారు.
తనిఖీల సందర్భంగా అన్ని అంబులెన్స్ వాహనాలు పరిశుభ్రంగా ఉండటంతో పాటు అవసరమైన వైద్య పరికరాలు, మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటం, సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో సమయపాలనతో సేవలు అందిస్తున్న తీరు పట్ల డాక్టర్ అవని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలాస 108 అంబులెన్స్ సిబ్బందిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల ప్రాణాలను కాపాడడంలో 108 అత్యవసర సేవలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ప్రతి కాల్ను బాధ్యతాయుతంగా స్వీకరించి వేగంగా స్పందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
భవిష్యత్తులో కూడా ఇదే సేవా స్ఫూర్తితో ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన అత్యవసర వైద్య సేవలు అందించాలని సూచించారు. పలాస 108 సిబ్బంది క్రమశిక్షణ, విధి నిర్వహణ, వాహనాల నిర్వహణ, సేవల నాణ్యత పట్ల చూపుతున్న అంకితభావం ప్రశంసనీయమని డాక్టర్ అవని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషం విలువైనదని, ప్రజలకు సకాలంలో వైద్య సహాయం అందించేందుకు ఇదే నిబద్ధతతో సేవలు కొనసాగించాలని ఆమె ఆకాంక్షించారు.
– వై 7 న్యూస్, పలాస









