శ్రీకాకుళం జిల్లా పలాస వై 7 న్యూస్ జూలై 1
పలాస మండలం జగన్నాధపురంలో దారుణం.రక్తపు మడుగులో బాధితులు..
పలాస:మండలం జగన్నాధపురంలో చోటుచేసుకున్న ఒక అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పొలం గట్టు విషయంలో మొదలైన చిన్నపాటి వాగ్వివాదం,చివరికి వృద్ధ దంపతులపై కిరాతక దాడికి దారితీసింది.గొడవ జరిగిన కొద్దిసేపటికే నిందితులు బాధితుల ఇంటిపై పడి విచక్షణారహితంగా దాడి చేయడం గ్రామంలో భయాందోళనలకు దారితీసింది.వివరాల్లోకి వెళ్తే…ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న తరుణంలో, జగన్నాధపురానికి చెందిన రైతు మామిడి మోహనరావు తన పొలం గట్లను బాగు చేసుకుంటున్నారు.ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన మామిడి జగన్ అక్కడికి చేరుకుని, తన పొలం గట్టును మోహనరావు ఆక్రమిస్తున్నాడని గొడవకు దిగాడు.ఈ వివాదంపై మోహనరావు సంయమనంతో స్పందిస్తూ,ఒకవేళ నాది తప్పు ఉంటే గ్రామ పెద్దల సమక్షంలో చర్చించి గట్టును తొలగిస్తాను”అని చెప్పి అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోయారు.
గ్రామ పెద్దల సమక్షంలో తేల్చుకుందాం అన్న మోహనరావు మాటలను ఏమాత్రంపట్టించుకోని జగన్,కక్షగట్టాడు. మోహనరావు ఇంటికి చేరుకున్న తండ్రీకొడుకులు,ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు మామిడి మోహనరావు, వరలక్ష్మిలపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.ఎటువంటి కరుణ లేకుండా వృద్ధులని కూడా చూడకుండా వారిపై దాడి చేయడంతో,వారు రక్తపు మడుగులో కుప్పకూలారు. స్థానికులు వెంటనే స్పందించి,తీవ్రంగా గాయపడిన వృద్ధ దంపతులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనతో జగన్నాధపురంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.గ్రామంలో గతంలో ఎప్పుడూ లేని ఈ సంస్కృతి పట్ల గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతానికి ఈ దాడికి పొలం గట్టు వివాదమే ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.అయితే,ఈ ఘటన వెనుక కేవలం భూ వివాదం మాత్రమే ఉందా లేక అంతకుముందే ఉన్న పాత రాజకీయ కక్షలు ఏవైనా కారణమయ్యాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది.









