భద్రాచలం 29 (వై7 న్యూస్): భద్రాచలంలో నిర్మించిన నూతన వంతెన సారపాక వైపు భాగంలో మరమ్మతు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు రాకపోకలను నిషేధించి భారీ గేట్లను ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల ఆ గేట్లను తొలగించి వంతెన సమీపంలో లారీలను పార్కింగ్ చేయడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, కొత్త వ్యక్తులు మరియు సాధారణ ప్రయాణికులు గేట్లు తొలగించబడిన విషయాన్ని గమనించకుండా వంతెన వైపు వెళ్లే అవకాశం ఉందని, దీంతో ఎప్పుడైనా పెను ప్రమాదం సంభవించే పరిస్థితి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే పది రోజుల క్రితం ఇదే ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. అయినప్పటికీ భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు కాకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిత్యం భారీ గేట్లు మూసి ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు, నిషేధిత ప్రాంతంలో లారీలను పార్కింగ్ చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ మేరకు భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇమంది నాగేశ్వరరావు అధికారులకు విజ్ఞప్తి చేశారు.









