అన్నపురెడ్డిపల్లి, జూన్ 27: అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శనివారం అన్నపురెడ్డిపల్లి మండలంలో పర్యటించి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి పథకాల కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని మర్రిగూడెం, అన్నపురెడ్డిపల్లి, అబ్బుగూడెం గ్రామాల్లో పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్న బూత్ స్థాయి అధికారుల పనితీరును పరిశీలించి, కాంగ్రెస్ పార్టీ నియమించిన బూత్ స్థాయి ప్రతినిధులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమన్నారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి యువతీ యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికే ఓటరు జాబితాలో ఉన్న వారి పేర్లు ఎలాంటి కారణాలతోనూ తొలగిపోకుండా అధికారులు, బూత్ స్థాయి ప్రతినిధులు సమన్వయంతో పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ప్రజలు కూడా తమ వివరాలను సక్రమంగా అందించి ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం శాంతినగర్, ఎర్రగుంట గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న పాఠశాల ప్రహరీ గోడలు, గ్రామ సంఘాల భవనాలు, భవిత భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పర్సా వెంకట్, సీనియర్ నాయకులు వనమా గాంధీ, భానోత్ భీముడు, వేముల రమణ, యువజన కాంగ్రెస్ నాయకులు, అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.








