సిఐటియు ఆధ్వర్యంలో బిటిపిఎస్ సిఈ బిచ్చన్న కు సమ్మె నోటీస్…
మణుగూరు మే 13( వై సెవెన్ న్యూస్);
కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని,కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్ ల రద్దు కు వ్యతిరేకంగా మే 20న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని బిటిపిఎస్ సిఈ బిచ్చన్నకు సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కొలగాని బ్రహ్మచారి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా కార్మిక,రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు.సామాన్యులపై భారాలు మోపుతూ కార్పొరేట్ సంస్థలకు స్వదేశీ,విదేశీ సంపన్నులకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తూ పేద ప్రజలపై భారాలు మోపుతుందని మండిపడ్డారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్ తదితర నిత్యవసర సరుకుల ధరలను పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా విదేశీ కార్పొరేట్లకు కట్టబెడుతుందని ఆయన అన్నారు. ఉపాధి,నిరుద్యోగం,అధిక ధరలు,ఆకలి, అసమానతలు,ఆరోగ్య రక్షణ వంటి కనీస సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనది ఆయన ఆరోపించారు.ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తున్న కార్మిక,ఉద్యోగ ప్రజాసంఘాలపై ఉక్కు పాదం మోపుతుందని ఆయన మండిపడ్డారు.కేంద్ర బడ్జెట్లో సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టి,సామాన్యులపై భారాలు విధిస్తూ కార్పొరేట్ సంస్థల సంపన్నులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి ప్రజాధనాన్ని లూటీ చేస్తుందని ఆయన ఆరోపించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్టు,ఔట్సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,సంఘటిత,అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు పని భద్రత కల్పించాలని,ఈఎస్ఐ,పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈనెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సంఘటిత,అసంఘటిత కార్మికులు అత్యధికంగా పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సత్రపల్లి సాంబశివరావు,నైనారపు నాగేశ్వరరావు,గడిదేశి మోహన్ రావు, అల్లి సుధాకర్ ఆర్ శ్రీను సాంబయ్య ఎగ్గడి రవి. శ్రీను. కృష్ణ తదితరులు పాల్గొన్నారు









