• ప్రతి గింజా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది
•కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లోకి సొమ్ములు జమ
• అవనిగడ్డ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై క్షేత్ర స్థాయి పరిశీలనలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
అవనిగడ్డ, డిసెంబర్ 4 వై 7 న్యూస్
రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దు.. ధాన్యం తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవద్దు.. రైతు పండించిన ప్రతి గింజా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంద ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామని హామీ ఇచ్చారు. బుధవారం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో స్థానిక శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ తో కలసి మనోహర్ క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు. రైతులు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగొళ్లలో సమస్యలపై రైతులను ఆరా తీశారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తేమ శాతం అటూ ఇటూగా ఉన్నా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. సాయంత్రంలోపు రైతులు సిద్ధం చేసిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని దిశానిర్దేశం చేశారు. చల్లపల్లి మండలం పాత మాజేరు, మంగళాపురం, చల్లపల్లి, కాసానగరం, పెదప్రోలు, ఘంటసాల మండలం లంకపల్లి తదితర గ్రామాల పరిధిలో శ్రీ మనోహర్ గారు క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు.