శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలకు సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న మామిడిమెట్టు గ్రామానికి చెందిన చెల్లూరి బైరాగి (45) కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో పండిన కూరగాయలను విక్రయించేందుకు భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై పలాసకు బయలుదేరారు.
ఈ క్రమంలో పలాస పట్టణానికి సమీపంలోని జాతీయ రహదారిపై వెళ్తుండగా, వేగంగా వచ్చిన ఇసుక లారీ వారి బైక్ను ఢీకొట్టింది. అనంతరం లారీ అదుపుతప్పి డెంపింగ్ యార్డులోకి వెళ్లినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో చెల్లూరి బైరాగి తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.








