బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) 70వ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు చేపట్టిన నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది విద్యార్థులు పట్నా వీధుల్లో ఆందోళనకు దిగారు. చారిత్రాత్మక గాంధీ మైదాన్ నుంచి ముఖ్యమంత్రి నివాసం వైపు విద్యార్థులు భారీ ర్యాలీగా బయలుదేరారు.
ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను కొందరు అభ్యర్థులు దాటుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయడంతో పాటు వాటర్ క్యానన్లను ప్రయోగించారు. దీంతో అక్కడ కొంతసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులు, విద్యార్థుల మధ్య జరిగిన తోపులాట, ఘర్షణలో పలువురు విద్యార్థులకు గాయాలైనట్లు తెలుస్తోంది. మరికొందరు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ సమస్యలపై ముఖ్యమంత్రి లేదా విద్యాశాఖ మంత్రితో నేరుగా చర్చలు జరపాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. BPSC పరీక్ష వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








