ఖమ్మం డెస్క్ ;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ రాజకీయాల్లో త్వరలో కొత్త సమీకరణాలు కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక కొత్త రాజకీయ పార్టీ తరఫున పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న మహిళా నాయకురాలు స్వయంగా Y7 News Teluguకు ఫోన్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
తాను ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని కలిసి పినపాక నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు, పార్టీ తరఫున ముందుకు సాగేందుకు సానుకూల హామీ లభించినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఒక ట్రస్టు ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.
అలాగే రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని గ్రామాలు, మండలాల్లో విస్తృత పర్యటనలు చేపట్టి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారం, సేవా కార్యక్రమాలు, మహిళా సాధికారత వంటి అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
అయితే, తాను ఏ రాజకీయ పార్టీ తరఫున పనిచేయనున్నది, భవిష్యత్ రాజకీయ ప్రణాళిక ఏమిటన్న విషయాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తానని ఆమె తెలిపారు.
పినపాక నియోజకవర్గ రాజకీయాల్లో ఈ కొత్త పరిణామం రానున్న రోజుల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాల్సి ఉంది.








