దేశంలో డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలను అరికట్టే దిశగా టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) కీలక నిర్ణయం తీసుకుంది. ఒక వ్యక్తి పేరుపై గరిష్టంగా 9 మొబైల్ కనెక్షన్లు మాత్రమే ఉండాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని అన్ని టెలికాం సేవా ప్రదాతలకు గురువారం కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనను ఉల్లంఘించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఇప్పటికే ఒక వ్యక్తి పేరుపై 9 సిమ్ కార్డులు ఉన్నట్లయితే, ఇకపై ఎలాంటి పరిస్థితుల్లోనూ అదనంగా కొత్త మొబైల్ కనెక్షన్ జారీ చేయకూడదని DoT ఆదేశించింది. కొత్త సిమ్ జారీ చేసే సమయంలో వినియోగదారుడి పేరుపై ఇప్పటికే ఉన్న మొబైల్ కనెక్షన్ల సంఖ్యను తప్పనిసరిగా పరిశీలించాలని టెలికాం కంపెనీలకు సూచించింది.
మొబైల్ నంబర్లను ఉపయోగించి జరుగుతున్న మోసాలు, నకిలీ గుర్తింపులతో సిమ్ కార్డుల వినియోగం, సైబర్ నేరాలను నియంత్రించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఒక వ్యక్తి పేరుపై అనధికారికంగా పెద్ద సంఖ్యలో మొబైల్ కనెక్షన్లు ఉండకుండా నియంత్రించడం ద్వారా టెలికాం వ్యవస్థను మరింత సురక్షితంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.








