నటి మనీషా కొయిరాలా తన ఆహారపు అలవాట్లు, శరీరంతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కొన్నేళ్లుగా ఆహారం విషయంలో తన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని ఆమె తెలిపారు. తాజాగా ఇన్స్టాగ్రామ్లో భోజనం చేస్తున్న ఫొటోను షేర్ చేసిన మనీషా.. తన వ్యక్తిగత అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు.
గతంలో ఆహారాన్ని నియంత్రణలు, అపరాధ భావనతో చూసేదానినని మనీషా వెల్లడించారు. అయితే ఇప్పుడు తన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం, ఆహారాన్ని ఆస్వాదించడం, శరీరం ఇచ్చే సంకేతాలను గమనించడం నేర్చుకున్నానని చెప్పారు. ఆహారం విషయంలో తనపై తాను అనవసరమైన ఆంక్షలు విధించుకోవడం కంటే, శరీరానికి అవసరమైన వాటిని అర్థం చేసుకోవడం ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.
తన శరీరంతో ఇకపై పోరాడాలని అనుకోవడం లేదని మనీషా స్పష్టం చేశారు. దానిని జాగ్రత్తగా చూసుకుంటూ, గౌరవంగా, సౌకర్యవంతంగా జీవించడమే తన లక్ష్యమని తెలిపారు. మనీషా పంచుకున్న ఈ ఆలోచనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శరీరాన్ని ప్రేమించుకోవడం, ఆహారాన్ని సానుకూల దృక్పథంతో చూడటం వంటి విషయాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి.








