ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సైనిక చర్యకు సంబంధించిన హెచ్చరికలు చేసిన ట్రంప్.. ప్రస్తుతం ప్రత్యక్ష సైనిక దాడికి బదులుగా ఆర్థిక, దౌత్యపరమైన ఒత్తిడిని పెంచే వ్యూహంపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. ఇరాన్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బలహీనపడుతున్న ఆర్థిక పరిస్థితిని అమెరికా నిశితంగా గమనిస్తోందని ట్రంప్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక వనరుల కొరత కారణంగా టెహ్రాన్పై ఒత్తిడి మరింత పెరుగుతోందని పేర్కొన్నారు. ఇరాన్తో పాక్షికంగా, గోప్యంగా చర్చలు కూడా కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
ఇరాన్ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందని, సైనికులకు జీతాలు చెల్లించేందుకు కూడా నిధుల కొరత ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా నావికా దిగ్బంధనం కూడా ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై అదనపు ఒత్తిడిని పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాలు కూడా భారీ సైనిక చర్యకు బదులుగా ఆర్థిక, దౌత్యపరమైన ఒత్తిడిని కొనసాగించాలని సూచించినట్లు ట్రంప్ గతంలో వెల్లడించారు.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు సుమారు 75 డాలర్ల వద్ద ఉండటం కూడా అమెరికాకు కొంత వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే మరో పెద్ద సైనిక ఘర్షణకు వెళ్లకుండా ఇరాన్పై ఒత్తిడిని కొనసాగించే అవకాశం వాషింగ్టన్కు లభిస్తోంది. ఈ పరిణామాలను చదరంగం ఆటతో పోల్చిన ట్రంప్.. సమస్య చివరకు పరిష్కారమవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.







