ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన
తాడ్వాయి, ఆగస్టు 10: తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ వనదేవతలను రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ (సీతక్క) సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.
తదుపరి ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఆమె, ఆలయ పీటీ బీమ్స్, క్యూ లైన్లు, మీడియా టవర్లు, గ్రానైట్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణం వెనుక భాగంలో ఏర్పాటు చేయనున్న నూతన క్యూ లైన్కు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.
అనంతరం ఈవో కార్యాలయ పరిసర ప్రాంతాలను సందర్శించిన మంత్రి సీతక్క, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జీ, సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, డీపీఓ వెంకయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఆలయ ఈవో, సంబంధిత జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.








