శ్రీకాకుళం జిల్లా, పలాస, జూలై 30 (Y7 న్యూస్):
మందస మండలం మందస గ్రామంలో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం” డోర్ టు డోర్ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే గౌతు శిరీష, వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రభుత్వ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించారు.
అలాగే గ్రామాభివృద్ధికి అవసరమైన తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.









