విద్యార్థులతో కలిసి భోజనం.. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన..
దుమ్ముగూడెం, జూలై 23 (వై7 న్యూస్): భద్రాచలం నియోజకవర్గం దుమ్ముగూడెం మండలం గౌరారం గ్రామంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ఆప్యాయంగా మాట్లాడి వారి విద్యాభ్యాసం, వసతి, భోజనం, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
పాఠశాలలో అందుతున్న సదుపాయాలను పరిశీలించిన ఎమ్మెల్యే, విద్యార్థుల సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారికి ప్రోత్సాహం అందించారు.
అలాగే పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని సూచిస్తూ, పచ్చదనం పెంపొందించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు, భద్రాచలం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి తెల్లం సీతమ్మ, దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తెల్లం హరిబాబు, గౌరారం గ్రామ సర్పంచ్ శ్యామల రవివర్మ, ఉపసర్పంచ్ సున్నం రమేష్, జిల్లా పార్టీ నాయకులు ముర్రం వీరభద్రం, లంక అబ్బులు, పిలక వెంకటరమణ రెడ్డి, సీనియర్ నాయకులు అన్నెం సత్యనారాయణమూర్తి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.








