కూనవరం, జూలై 23 (వై7 న్యూస్): కూనవరం మండలంలో రైతులకు ఇప్పటి వరకు విత్తనాలు పూర్తిస్థాయిలో అందకపోవడంపై జడ్పీటీసీ సభ్యురాలు గుజ్జా విజయ ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ విధానం పేరుతో వెబ్ల్యాండ్లో నమోదు ఉన్న రైతులకు మాత్రమే విత్తనాలు అందజేస్తుండటం వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
గతంలో రైతులు పట్టాదారు పాస్పుస్తకం ప్రతితో రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి విత్తనాలు పొందేవారని, ప్రస్తుతం ఆన్లైన్ నిబంధనల కారణంగా అర్హులైన పలువురు రైతులు విత్తనాలకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
ఇప్పటికే వర్షాలు సకాలంలో లేక రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో, విత్తనాల పంపిణీలో కూడా సమస్యలు తలెత్తడం రైతాంగాన్ని మరింత కష్టాల్లోకి నెడుతోందన్నారు. అర్హులైన ప్రతి రైతుకు ఎలాంటి వివక్ష లేకుండా విత్తనాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రస్తుత పరిస్థితి కొనసాగితే కూనవరం మండలాన్ని కరువు ప్రభావిత మండలంగా గుర్తించి, నష్టపోయిన ప్రతి రైతుకు రూ.1 లక్ష చొప్పున నష్టపరిహారం అందించాలని ఆమె కోరారు. రైతే దేశానికి వెన్నెముక అని, రైతు సంక్షేమమే దేశాభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు.








