మణుగూరు, జూన్ 28 (వై7 న్యూస్):
మణుగూరు మండలంలోని సమితి సింగారంలో జూనియర్ కళాశాల సమీపంలో ప్రజల అవసరాల దృష్ట్యా ఏర్పాటు చేసిన వారాంత సంతను స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు.
ఈ సంతలో రైతులు పండించిన తాజా కూరగాయలు, ఆహార ఉత్పత్తులు, పప్పు దినుసులు విక్రయించడంతో పాటు కుటుంబ అవసరాలకు ఉపయోగపడే వివిధ వస్తువులు అందుబాటులో ఉంచారు. గ్రామీణ రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశం కల్పించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు లభించేలా ఈ సంతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులకు, వినియోగదారులకు ఒకే వేదికపై ప్రయోజనం చేకూర్చే ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రైతులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.







