భద్రాచలం, జూన్ 28 (వై7 న్యూస్):
ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని మహాజన సమితి ఆదివాసి మహిళ రాష్ట్ర కన్వీనర్ కంగాల రమణకుమారి డిమాండ్ చేశారు.
ఆదివారం ఆమె మాట్లాడుతూ, సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ నివారణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు. ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి, వ్యాధుల నిర్ధారణకు అవసరమైన పరీక్షా కిట్లు, మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేసి, ప్రజలకు సంపూర్ణ వైద్య సేవలు అందేలా చూడాలని ఆమె కోరారు. చిన్నచిన్న చికిత్సలకే ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి లేకుండా ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేయాలని అన్నారు.
వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఉన్నతాధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేపట్టాలని, విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వైద్యులు కేవలం మందుల చీటీలు రాసి పంపించడం కాకుండా రోగులకు పూర్తి స్థాయి వైద్యం అందించాలని, ప్రభుత్వ వైద్య సేవలను కట్టుదిట్టం చేయకపోతే పేద ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కంగాల రమణకుమారి ఆందోళన వ్యక్తం చేశారు.
– జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రాజేష్ తమ్మళ్ల








