హైదరాబాద్, నవంబర్ 18:
సమాజాన్ని మాదక ద్రవ్యాల ప్రమాదం నుంచి రక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ ఎన్. బలరామ్ అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉందని పేర్కొన్న సీఎండీ, యువత డ్రగ్స్ బారిన పడితే అది దేశ అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల వ్యసనం ఒక్క కుటుంబానికే కాదు, మొత్తం సమాజానికే తీవ్రమైన ప్రమాదమని హెచ్చరించారు. డ్రగ్ వ్యసనాన్ని నిర్మూలించేందుకు ప్రజలంతా సమిష్టిగా కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది అందరూ కలసి మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) బి. వెంకన్న, జీఎం (కోఆర్డినేషన్) టి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.









