మణుగూరు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్ ఆదేశాల మేరకు, మణుగూరు మండలంలోని సింగరేణి హైస్కూల్లో బాల్యవివాహాల నిర్మూలన కోసం వందరోజుల ప్రచార ఉద్యమ గోడపత్రికను ప్రధానోపాధ్యాయురాలు ఆర్. కళ్యాణి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమం యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించగా, ఎన్జీవో ప్రతినిధులు సి.ఎస్.ఎం. నాగుల, జ్యోతి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఆర్. కళ్యాణి మాట్లాడుతూ,భద్రాద్రి జిల్లాను బాల్యవివాహ రహిత జిల్లాగా మార్చాలనే కలెక్టర్ జితేష్ వి. పాటిల్ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. బాల్యవివాహాలు ఆడపిల్లల భవిష్యత్తుకు అడ్డంకులుగా మారుతున్నాయనీ, విద్యతోనే వారికి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
బాల్యవివాహాలకు పాల్పడిన వారు లేదా సహకరించినవారు చట్టపరమైన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ, పిల్లల సమస్యల కోసం 24 గంటల చైల్డ్ లైన్ 1098 కు ఫోన్ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు మస్తాన్ ,వెంకన్న పాల్గొన్నారు.









