మణుగూరు | 30 అక్టోబర్ 2025
నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు అందుబాటులో సింగరేణి పాఠశాల విద్య.విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని సింగరేణి సిఎండి ఎన్. బలరాంను కోరుతూ వినతి
మణుగూరు ఏరియా సామాజిక సేవకులు కర్నే బాబురావు ఆధ్వర్యంలో సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ జిఎం వెంకటాచారి (కొత్తగూడెం) మరియు మణుగూరు పివి కాలనీ సింగరేణి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్. కళ్యాణికి వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా కర్నే బాబురావు మాట్లాడుతూ సింగరేణి పాఠశాలలు నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం మణుగూరు సింగరేణి హైస్కూల్లో సుమారు 650 మంది విద్యార్థులు చదువుతున్నారని, పాఠశాలపై తల్లిదండ్రుల విశ్వాసం పెరుగుతోందని పేర్కొన్నారు.
అయితే దూర ప్రాంతాల నుండి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సరిపడ బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రస్తుత ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో 50 సీట్ల సామర్థ్యం ఉన్నప్పటికీ 90-100 మంది విద్యార్థులను ఎక్కిస్తున్నారని, దీంతో బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని చెప్పారు. ఇది రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధమని, విద్యార్థుల ప్రాణ భద్రత దృష్ట్యా సింగరేణి సంస్థ తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బస్సుల సంఖ్య పెంచడమో లేదా అదనపు ట్రిప్పులు ఏర్పాటు చేయడమో చేయాలని, విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అనవసర సెలవులు ఇవ్వకుండా చూడాలని ఆయన కోరారు.
అలాగే ఆయన నాలుగు ప్రధాన సమస్యలను వివరించారు:
1️⃣ విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలి.
2️⃣ పాఠశాల మరుగుదొడ్ల పరిశుభ్రత కచ్చితంగా పాటించాలి.
3️⃣ విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం త్రాగునీటి అవసరార్థం ఓ ఆర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి.
4️⃣ విద్యార్థులకు విలువలు, ట్రాఫిక్ రూల్స్, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించాలి.
జిఎం వెంకటాచారి ఈ వినతిపై సానుకూలంగా స్పందించినందుకు కర్నే బాబురావు హర్షం వ్యక్తం చేశారు.









