కొత్తగూడెం
కొత్తగూడెం రీజియన్ పరిధిలో పనిచేస్తున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు 2025 మార్చి వరకు పిఎఫ్ జమ వివరాలు అందజేయాలని, పిఎఫ్ ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తేవాలని ఐఎఫ్టీయూ నాయకులు డిమాండ్ చేశారు.
గురువారం సాయంత్రం కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో, గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్.డి. నాసర్ పాషా నేతృత్వంలో, ఐఎఫ్టీయూ ప్రతినిధులు సీఎం పిఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ కనకమ్మ, ఇన్స్పెక్టర్ చిరంజీవిలకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాసర్ పాషా మాట్లాడుతూ,
“కొత్తగూడెం రీజియన్ సీఎం పిఎఫ్ కార్యాలయ పరిధిలోని మణుగూరులో 2022 మార్చి వరకు మాత్రమే పిఎఫ్ జమ వివరాలు కాంట్రాక్ట్ కార్మికులకు అందజేశారు. ఈ సంవత్సరం మార్చి (2025) వరకు జమ వివరాలు ఇప్పటికీ తెలియజేయలేదు. మణుగూరు ఏరియా యాజమాన్యం సంబంధిత వివరాలను ఇప్పటికే కొత్తగూడెం పిఎఫ్ కార్యాలయానికి పంపింది. కాబట్టి దయచేసి వీలైనంత త్వరగా వివరాలు విడుదల చేయాలి,” అని పేర్కొన్నారు.
అలాగే, మణుగూరు ఏరియా స్టోర్స్ విభాగం కాంట్రాక్ట్ కార్మికులకు గత ఐదు సంవత్సరాలుగా పిఎఫ్ జమ వివరాలు తెలియకపోవడం బాధాకరమని, అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికుల వివరాలు 2025 మార్చి వరకు అందజేయాలని కోరారు.
ఆన్లైన్ పిఎఫ్ సేవలు సక్రమంగా అందుబాటులోకి రావాలని, పిఎఫ్ వాపస్ కేసులు త్వరగా పరిష్కరించాలని, కొత్తగా చేరిన కార్మికులకు వెంటనే పిఎఫ్ నంబర్లు ఇవ్వాలని నాసర్ పాషా విజ్ఞప్తి చేశారు.
సీఎం పిఎఫ్ అధికారులు సానుకూలంగా స్పందించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పులిపాటి పాపారావు | జర్నలిస్ట్
#SCCL #Kothagudem #Manuguru #ContractWorkers #PFDetails #IFTU #Y7NewsTelugu









