మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ చేతుల మీదుగా సత్కారం
పలాస, సెప్టెంబర్ 7 (వై7 న్యూస్):
ఉద్దానం సాహితీ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి వజ్రపుతూరు మండలం అక్కుపల్లి గ్రామంలో శ్రీరామ సేవా సంఘం సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్దానం ప్రాంతానికి చెందిన మహిళా జర్నలిస్టు పుక్కళ్ల కరుణ కుమారి ఘన సన్మానం అందుకున్నారు.
సంస్థ నవ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ మాట్లాడుతూ, గత 30 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర ఫోకస్ పత్రిక సబ్ ఎడిటర్, రాష్ట్ర మత్స్యకార మహిళా సంఘ ఉపాధ్యక్షురాలిగా సేవలందిస్తున్న పుక్కళ్ల కరుణ కుమారిని సన్మానించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.
మాజీ మంత్రి శివాజీ ఆమెకు దుశ్శాలువ కప్పి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. ఉద్దానం ప్రాంత ప్రజల్లో పోరాట స్ఫూర్తి ఎంతో గొప్పదని, తన తండ్రి సర్దార్ గౌతు లచ్చన్న ఈ ప్రాంత చరిత్ర, పోరాటాల గురించి తరచూ వివరించేవారని గుర్తుచేసుకున్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ప్రజల అభిమానాన్ని పొందానని తెలిపారు.
అదే సమయంలో ఉద్దానం ప్రాంతానికి చెందిన కరుణ కుమారి విశాఖపట్నంలో నివసిస్తూ మహిళా జర్నలిస్టుగా గుర్తింపు పొందడం విశేషమని, ఆమె మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఉద్దానం సాహితీ సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు లండా రుద్రమూర్తి, కార్యదర్శి శివజ్యోతి రాజారావు, నిశ్చితాసి, సూరాడ మోహనరావు, దాసరి తాతారావు, అంబటి రామకృష్ణ, శ్రీరామ సేవా సంఘం అధ్యక్షుడు మోసా వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.








