పలాస / మందస, సెప్టెంబర్ 2 (వై7 న్యూస్): శ్రీకాకుళం జిల్లాలో ఓ ఐటీబీపీ (ITBP) కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని నింపింది. మందస మండలం టబ్బుగాం గ్రామానికి చెందిన సవర శేషగిరి (28) ఒడిశాలోని ఖుర్దా యూనిట్లో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు.
సెలవుపై స్వగ్రామానికి వచ్చిన శేషగిరి మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అయితే సాయంత్రం గ్రామ సమీపంలోని జీడి తోటలో చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో ఆయన మృతదేహం కనిపించింది. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న మందస పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శేషగిరి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మందస పోలీసులు వెల్లడించారు. యువ కానిస్టేబుల్ ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.









