హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించాలని సూచిస్తూ క్రమశిక్షణ కమిటీ తన నివేదికను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్కు సమర్పించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినప్పటికీ మంత్రి కొండా సురేఖ వైఖరిలో మార్పు కనిపించలేదని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. పార్టీ నిర్ణయాలు, పార్టీ లైన్కు విరుద్ధంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఉందని, ఇలాంటి వ్యవహారాల్లో చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
అయితే క్రమశిక్షణ కమిటీ నివేదికపై తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానం తీసుకోనుంది. దీంతో మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.








