పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఆదివారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. హడోవా పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపుకూర్ ప్రాంతంలోని ఓ ఐస్ ఫ్యాక్టరీ నుంచి ప్రమాదవశాత్తు అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. విషపూరిత వాయువు గాలిలో వేగంగా వ్యాపించడంతో స్థానికంగా ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితి నెలకొంది.
గ్యాస్ లీక్ ప్రభావంతో సమీప గ్రామానికి చెందిన పిల్లలు, మహిళలు సహా 25 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. కొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్లలో మంట, వికారం వంటి సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం.
ఈ ఘటనతో షాపుకూర్ ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే చర్యలు చేపట్టారు. గ్యాస్ లీకేజీకి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.








