తేగడ హైస్కూల్లో అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్
చర్ల, ఆగస్టు 12: చర్ల మండల పరిధిలోని తేగడ ప్రభుత్వ హైస్కూల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన అదనపు తరగతి గదుల భవనం వద్ద బుధవారం విద్యార్థులతో కలిసి స్థానిక యువత నిరసన వ్యక్తం చేసింది. తరగతి గదుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు.
2020–21 సంవత్సరంలో ఎఫ్.ఎఫ్.సీ నిధుల నుంచి రూ.16 లక్షలు మంజూరు చేసి భవన నిర్మాణం ప్రారంభించినప్పటికీ, పైన విద్యుత్ లైన్ ఉందనే కారణంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయని గ్రామస్తులు తెలిపారు. నిర్మాణానికి ముందు స్థలాన్ని సరిగా పరిశీలించకుండా పనులు ప్రారంభించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.
పాఠశాల ఆవరణలో తగినంత స్థలం ఉన్నప్పటికీ సరైన ప్రణాళిక లేకపోవడంతో ప్రజాధనం వృథా అవుతోందని, అధికారులు వెంటనే స్పందించి నిర్మాణాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
ఈ సందర్భంగా యువ నాయకుడు పెద్దిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. యువ న్యాయవాది పరిటాల సంతోష్ మాట్లాడుతూ అసంపూర్తిగా నిలిచిన భవనంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, శ్రీను , రాజు, పెద్దిరెడ్డి నిరంజన్ నవీన్, పరిటాల సంతోష్, మద్ది లక్ష్మీనరసింహారెడ్డి, , తదితరులు పాల్గొన్నారు.








