విలేకరులపై అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్
అశ్వాపురం, ఆగస్టు 11: అశ్వాపురం మండలంలోని విలేకరులపై నెల్లిపాక సహకార సంఘం అధ్యక్షుడు తుక్కాని మధుసూదన్ రెడ్డి నమోదు చేయించినట్లు ఆరోపిస్తున్న అక్రమ కేసులను ఖండిస్తూ మంగళవారం జర్నలిస్టులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు, విలేకరులు పాల్గొని అక్రమ కేసులు నమోదు చేయడాన్ని, జర్నలిస్టుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే పాత్రికేయులపై కక్షసాధింపు చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వారు పేర్కొన్నారు.
నెల్లిపాక సహకార సంఘం అధ్యక్షుడు తుక్కాని మధుసూదన్ రెడ్డి వెంటనే జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, విలేకరులపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
నిరసనలో భాగంగా అశ్వాపురం మండలంలోని జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అశ్వాపురం కాలనీ గేట్ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన విలేకరులు అనంతరం తహసీల్దార్ సూర్యప్రకాష్కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, మీడియా సంస్థల విలేకరులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. జర్నలిస్టుల స్వేచ్ఛను పరిరక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.









