కొత్తగూడెం, ఆగస్టు 1 (వై7 న్యూస్ తెలుగు)
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కట్టా సతీష్ ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెం జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపయోగపడే పలు పోటీ పరీక్షల పుస్తకాలను అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, జిల్లా గ్రంథాలయ లైబ్రేరియన్ మణి మృదుల, ఆర్ఎల్డీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గుగులోత్ పృథ్వి నాయక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కట్టా సతీష్, విద్యార్థులు కష్టపడి చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.
అనంతరం చంద్రుగొండ మండలం రేపల్లెవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల అధ్యక్షుడు పసుపులేటి వీరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన నోట్బుక్ పంపిణీ కార్యక్రమానికి కట్టా సతీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేసిన ఆయన మాట్లాడుతూ, “విద్యే విద్యార్థులకు గొప్ప ఆస్తి, జీవితాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధం” అని అన్నారు. పేద విద్యార్థులకు విద్యా సహాయం అందించడం నిజమైన సామాజిక సేవ అని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎల్డీ స్టూడెంట్ వింగ్ జిల్లా అధ్యక్షుడు గుగులోత్ పృథ్వి నాయక్, బీజీపీఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. రామచంద్ర, ఉపాధ్యాయులు బాలాజీ, సంధ్యారాణి, డి. సంపత్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.









