సోషల్ మీడియా ప్రభావం లేని రోజుల్లోనే భారతీయ టెలివిజన్ సీరియల్స్ నటీనటులకు అపారమైన అభిమానాన్ని సంపాదించిపెట్టాయి. ముఖ్యంగా ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ’ సీరియల్ దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుని, అందులో నటించిన కళాకారులను ఇంటింటికీ చేరువ చేసింది. ఆ సీరియల్లో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటి అపరా మెహతా తాజాగా తన కెరీర్లో ఎదురైన ఓ షాకింగ్ సంఘటనను గుర్తుచేసుకున్నారు.
సీరియల్ అత్యున్నత ప్రజాదరణలో ఉన్న సమయంలో అపరా మెహతా నటించిన ఓ గుజరాతీ నాటకాన్ని కోల్కతాలోని కళామందిర్ హాలులో ప్రదర్శించారు. వరుసగా ఐదు షోలకు భారీగా ప్రేక్షకులు తరలివచ్చి హాలును పూర్తిగా నింపేశారు. అపరా మెహతా వేదికపైకి రాగానే అభిమానులు ఆమెను దగ్గరగా చూడాలని ఉత్సాహంతో ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు.
ఆ ఉత్సాహం క్రమంగా అదుపు తప్పడంతో వేలాది మంది ప్రేక్షకులు దాండియా కర్రలను గాల్లోకి విసిరేయగా, అక్కడ ఒక్కసారిగా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 8,000 దాండియా కర్రలు గాల్లో ఎగిరిపడడంతో అందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారని అపరా మెహతా వెల్లడించారు. ఆ సంఘటన ఇప్పటికీ తన మదిలో చెరగని జ్ఞాపకంగా మిగిలిపోయిందని ఆమె తెలిపారు.









