భద్రాచలం, జూలై 25 ( వై 7 న్యూస్ తెలుగు);
భద్రాచలంలో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర టీజీపీఈ జేఏసీ పిలుపు మేరకు శనివారం ఎన్పీడీసీఎల్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై తమ నిరసనను వ్యక్తం చేశారు.
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు సంఘీభావంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా భద్రాచలం ఎన్పీడీసీఎల్ డీఈ, జేఏసీ జిల్లా కన్వీనర్ జీవన్ కుమార్ మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటే ఉద్యోగులు, కార్మికులు, అన్ని సంఘాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తే ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల హక్కులు, ప్రజా ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఏడీఈ నర్సింహారావు, ట్రేడ్ యూనియన్ నాయకులు వెంకట్రాజు, రామకృష్ణ, ఉదయ్, కేటీఎన్ మూర్తి, పెదరాజు, ప్రవీణ్, ఏఈలు, సబ్ ఇంజినీర్లు మరియు వివిధ సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు.









