భద్రాచలం ;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం దంతలబోర్ ఎస్సీ కాలనీ సర్పంచ్ సోడే వెంకటరమణ భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం అత్యంత బాధాకరమని GSS రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల పనితీరుపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
సోడే వెంకటరమణ మృతి ఘటనపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై చర్యలు చేపట్టాలని కోరారు.
స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈ ఘటనపై వెంటనే స్పందించి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బాధిత కుటుంబానికి తగిన సహాయం అందించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
సోడే వెంకటరమణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి ధైర్యం కలగాలని ప్రార్థిస్తున్నట్లు అరేం ప్రశాంత్ తెలిపారు.









