మణుగూరు, జూలై 22 (వై7 తెలుగు న్యూస్): ఏఐసీసీ నాయకులు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టు అప్రజాస్వామికమని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గురిజాల గోపి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు ప్రతిపక్ష నాయకులపై చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పేపర్ లీకేజీ ఘటనలపై ప్రశ్నించిన రాహుల్ గాంధీ, విద్యార్థుల శాంతియుత నిరసనపై ఢిల్లీలో బాష్పవాయువు ప్రయోగించడం, లాఠీచార్జి చేయడం హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో బుధవారం మణుగూరు అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు పూనం సరోజ, సీనియర్ మహిళా నాయకురాలు ఎండి షబానా ఆధ్వర్యంలో మౌన నిరసన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 100 మంది మహిళా నాయకులు, కార్యకర్తలు నోరుకు నల్ల రిబ్బన్లు ధరించి కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా తమ నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా నాయకులు బొడ్డు సౌజన్య, కోరి శ్యామల, కన్నాపురం వసంత, డేరంగుల సుజాత, రెడ్డిబోయిన రేణుక, కన్నాపురం శైలజ, బాడిష పార్వతి, లక్కింశెట్టి హేమలత తదితరులు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.









