పలాస, జూలై 21 (వై7 న్యూస్): చిరు వ్యాపారుల సంక్షేమమే సమాజ అభివృద్ధికి పునాదని ఏపీటీపీసీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వజ్జ బాబూరావు అన్నారు. పలాస క్యాజుల్యాండ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు ఉచితంగా గొడుగులు పంపిణీ చేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వజ్జ బాబూరావు లబ్ధిదారులకు గొడుగులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు, వర్షాలు లెక్కచేయకుండా జీవనోపాధి కోసం వీధుల్లో వ్యాపారం చేసే చిరు వ్యాపారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అలాంటి వారికి రక్షణగా నిలిచే గొడుగులను అందించడం అభినందనీయమైన సేవా కార్యక్రమమని అన్నారు.
సమాజంలోని వివిధ వర్గాల అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులను ఆయన అభినందించారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మానవతా విలువలు మరింత బలోపేతం అవుతాయని, ప్రతి ఒక్కరూ తమ వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పి. శివకుమార్ మాట్లాడుతూ సామాజిక సేవే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, పేదల సంక్షేమం వంటి రంగాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పి. శివకుమార్, కార్యదర్శి ఎం. కామేశ్వరరావు, ట్రెజరర్ వి. రామారావు, సభ్యులు శివానంద స్వామి, వెంకటరాజు, నాగేశ్వరరావు, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
– వై7 న్యూస్ వెబ్ డెస్క్








