E-PAPER

ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ అభ్యర్థి నందని అనుమానాస్పద మృతి.. హత్యనా? ఆత్మహత్యనా?

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ అభ్యర్థి, 23 ఏళ్ల నందని బోస్మియా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గొండాల్ చౌక్డీ సమీపంలోని ఆమె ఉంటున్న అద్దె ఫ్లాట్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించారు. గతేడాది జరిగిన జెట్‌పూర్-నవగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ తరఫున పోటీ చేసిన నందని, ప్రస్తుతం ఒక సంస్థలో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఫ్లాట్‌కు చేరుకుని చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు ప్రాథమికంగా దీన్ని ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ, నందని కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. జునాగఢ్‌కు చెందిన అస్లాం హుస్సేన్ సమా అనే వివాహితుడితో నందని కొంతకాలంగా సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్‌షిప్) చేస్తోంది. అయితే, అస్లాం తన మొదటి భార్యతోనూ సంబంధాలు కొనసాగిస్తుండటంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని సమాచారం. ఈ క్రమంలోనే అస్లాం ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించాడని, అతడే నందనిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న రాజ్‌కోట్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు అస్లాం ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. ఇద్దరి మధ్య ఉన్న పాత వివాదాలను పోలీసులు ప్రాథమిక విచారణలో ధ్రువీకరించారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తి నివేదిక మరియు ఇతర ఆధారాలు లభించిన తర్వాతే ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే విషయంపై పూర్తి స్పష్టత వస్తుందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!