డిసెంబర్లో జరగబోయే నోబెల్ ప్రైజ్ డే ఉత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ
హన్మకొండ:
విద్యార్థులలో పరిశోధనాపట్ల, సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించే దిశగా నోబెల్ ప్రైజ్ డే ఉత్సవాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కే. ప్రతాప్ రెడ్డి అన్నారు. కేయూ స్వర్ణోత్సవాల సందర్భంగా వచ్చే నెల డిసెంబర్ 9, 10 తేదీల్లో డీన్ స్టూడెంట్స్ అఫైర్స్ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించబోయే నోబెల్ ప్రైజ్ డే సెలబ్రేషన్స్ బ్రోచర్ను వీసీ ఛాంబర్లో ఆవిష్కరించారు.
వీసీ మాట్లాడుతూ,
“పరిశోధనల్లో విద్యార్థులు రాణించాలి. సబ్జెక్ట్పై పట్టు పెంపొందించుకోవాలి. నోబెల్ బహుమతి పొందిన మహానుభావుల ఆవిష్కరణలు ప్రతి విద్యార్థికి స్పూర్తి కావాలి” అని పేర్కొన్నారు. కార్యక్రమ నిర్వాహకుల కృషిని అభినందించారు.
డిసెంబర్ 9న పోస్టర్ ప్రజెంటేషన్ & వక్తృత్వ పోటీలు
డిసెంబర్ 9న రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, ఇంగ్లిష్, లైఫ్ సైన్సెస్ (బాటనీ, జూవాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ), ఫార్మసీ విభాగాల విద్యార్థుల కోసం పోస్టర్ ప్రజెంటేషన్, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
పోటీల అంశాలు:
రసాయన శాస్త్రం: శాస్త్రం & సమాజాన్ని మార్చిన నోబెల్ ఆవిష్కరణలు
భౌతిక శాస్త్రం: నోబెల్ భౌతిక శాస్త్ర ఆవిష్కరణలు ఆధునిక ప్రపంచంపై ప్రభావం
లైఫ్ సైన్సెస్ & ఫార్మసీ: నోబెల్ ఆవిష్కరణలు మానవ ఆరోగ్యానికి లాభం
ఆర్థిక శాస్త్రం: నోబెల్ ఆర్థిక విజేతలు సమాజంలో మార్పు
ఇంగ్లిష్: సాహిత్యంలో నోబెల్ విజేతలు – ప్రపంచాన్ని మార్చిన స్వరాలు
విద్యార్థులు తమ పేర్లను డిసెంబర్ 5లోపు విభాగాల్లో లేదా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని చెప్పారు.
డిసెంబర్ 10న సెమినార్లు — ముగింపు సమావేశం
డిసెంబర్ 10న ఆయా విభాగాల్లో నోబెల్ బహుమతి పొందిన పరిశోధనలపై నిపుణులతో సెమినార్లు జరుగనున్నాయి. అనంతరం సెనేట్ హాల్లో జరిగే ముగింపు కార్యక్రమంలో వీసీ, రిజిస్ట్రార్ విజేతలకు బహుమతులు అందజేస్తారు.
ఈ కార్యక్రమ నిర్వహణ కోసం విద్యార్థులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు, వారి పాత్ర ఎంతో కీలకమని నిర్వాహకులు తెలిపారు. యూత్ వెల్ఫేర్ ఆఫీసర్లు డా. రాధికా, డా. నిరంజన్ ఈ సందర్భంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వీసీ ప్రో. ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రో. వి. రామచంద్రం, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రో. మనోహర్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రో. కృష్ణవేణి, డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రో. మామిడాల ఇస్తారి, విద్యార్థి కన్వీనర్లు వికాస్, శ్రేయ, హరిత పాల్గొన్నారు









