భద్రాచలం,ఆగస్టు28 వై 7 న్యూస్;
భద్రాచలం గోదావరి నది కరకట్ట వద్ద గణేష్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పరిశీలించారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో భద్రాచలానికి విచ్చేసే నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా గోదావరి కరకట్ట వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి, అక్కడి అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. గోదావరి నది ప్రస్తుతం ఉదృతంగా ప్రవహిస్తోందని, ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
కరకట్ట మీదకు ఎవరూ రాకూడదని, ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎవరైనా అక్కడ సంచరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కరకట్ట పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.









